పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న బిస్కట్ కంపెనీకి అలుముకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గాలిబ్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ కవర్ల స్క్రాప్ గోదాములో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఆ మంటలు దానిని ఆనుకొని ఉన్న అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ (బిస్కట్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్)కు అంటుకొని అందులోని ముడిసరుకు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మూడు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బేకరీ యజమాని సయ్యద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


