బంట్వారం: ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న 14 వారాల కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బంట్వారం మండలం తొర్మామిడి, బస్వాపూర్ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలలో మాట్లాడారు. పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు వేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దినసరి కూలీ రూ.307 నుంచి రూ.600కు పెంచడంతో పాటు 200 రోజులు కల్పించాలని కోరారు. ప్రమాద బీమా కల్పించాలని, అడిగిన వెంటనే కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు ఫొటోలు తీయడం వలన 4 గంటల సమయం వృథా అవుతుందని, పాత పద్ధతినే కొనసాగించాలని సూచించారు. రైతు కూలీల వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు, సీపీఎం కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్


