అధికారులు
లేకుండా
తాండూరు రూరల్: ప్రభుత్వం కట్టించిన ఇళ్లను ప్రైవేట్ వ్యక్తులతో డ్రా తీయంచడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల పేరిట జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు డ్రా తీస్తే మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు వెళ్లి చప్పట్లు కొట్టడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కార్యక్రమం బ్యానర్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అని ఉందని.. తాండూరు మున్సిపాలిటీలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. అవన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లే అని చెప్పారు. అధికారులు లేకుండా ఆదివారం 200 మందికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పి డ్రా ఎలా తీశారని మండిపడ్డారు. పేద మైనార్టీలకు ఇళ్లు ఇవ్వడం సంతోషమే.. కానీ తాండూరులో 25 వేల మంది మైనార్టీలు ఉన్నారని వారిలో 200 మంది పేదలు ఉన్నారా..? అని ప్రశ్నించారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీమూబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక నుంచి జీఎంకే ట్రస్ట్ నుంచి ఇస్తారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ని సైతం ప్రభుత్వం మెగా కృష్షారెడ్డికి దారదత్తం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు.
జీఎంకే ట్రస్ట్తో ఎమ్మెల్యేకు ఏం సంబంధం: రాజుగౌడ్
తాండూరులో పేదలకు ఇళ్లు ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ డ్రా తీయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం జీఎంకే ట్రస్ట్ ద్వారా 200 మందికి ఇళ్లు కేటాయిస్తాన్నట్లు డ్రా తీయడం సరికాదన్నారు. జీఎంకే ట్రస్ట్కు ఎమ్మెల్యే మనోహార్రెడ్డికి ఏం సంబంధం ఉందో ప్రజలకు చెప్పాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యేకు ఎంత వాటా ఉందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల, తాండూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి, వీరేంధర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్ చారి, సిద్రాల శ్రీనివాస్, ఆసిఫ్, నరేందర్గౌడ్, కౌన్సిలర్లు జావిద్, సుప్రీత, నాగలక్ష్మీ, నవీన సంతోశ్గౌడ్, సురేశ్ నాయక్, అనిల్, యోగానంద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలకు ప్రైవేట్ వ్యక్తులు డ్రా తీయడం సరికాదు
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి.. ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పుకోవడం హాస్యాస్పదం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్


