స్వాగతం పలికిన కలెక్టర్ దీపక్ తివారీ
అనంతగిరి: తాండూర్లో నేడు మంత్రుల కార్యక్రమం నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రొడక్షన్ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం సాయంత్రం అనంతగిరి హరిత రిసార్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆయనకు మొక్క అందజేసి స్వాగతం పలికారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
అనంతగిరి: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లో బీజేపీ జిల్లా ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ.. మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటి సారిగా నగరానికి వస్తున్నారని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3– 4 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని ఆరోపించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. ప్రజలు మోదీ సుపరిపాలనను స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, మాధవరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, సీనియర్ నాయకులు శ్రీధర్రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
ధారూరు: నలుగురు వ్యక్తులు నన్ను చంపేందుకు యత్నిస్తున్నారని ఓ మహిళ.. ఎస్పీ స్నేహమెహ్రని ఆశ్రయించింది. వివరాలు.. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన రాణెమ్మ భర్త 22 ఏళ్ల క్రితం మృతి చెందగా ఆమె గ్రామానికి చెందిన నంచర్ల మల్రెడ్డితో సహజీవనం చేస్తోంది. రెండేళ్ల క్రితం మల్రెడ్డి తన కొడుకుతో గొడవపడి హత్య చేసాడని ఫిర్యాదులో పేర్కొంది. మల్రెడ్డి వేధింపుల కారణంగా గ్రామంలో పంచాయితీ పెట్టించానని, గ్రామపెద్దలు సర్దిచెప్పినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయింది. ఏడాది మార్చి 29న పరిగి రోడ్డులో, ఏప్రిల్ 25న వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మల్రెడ్డితో పాటు దస్తగీర్, సాయిరెడ్డి, కృష్ణారెడ్డి తనపై దాడికి పాల్పడ్డారని చెప్పింది. గొంతునులిమి చంపేందుకు యత్నించడంతో స్థానికులు రక్షించారని పేర్కొంది. అసభ్యపదజాలతో దూషిస్తూ తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
కల్నల్ శ్రీనివాస్
మొయినాబాద్: దేశ రక్షణకోసం అసువులుబాసిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కల్నల్ శ్రీనివాస్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో వచ్చే నవంబర్లో జరగనున్న 201 మద్రాసు ఇంజనీరింగ్ రెజిమెంట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశం ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధ సమయంలో తాను కమాండింగ్ ఆఫీసర్గా స్వయంగా పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేశారు. సైనికులు, మాజీ సైనికులు రెజిమెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.


