తాండూరు రూరల్: పట్టణంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి నిర్వహించిన లక్కీ డ్రా రాజకీయ దుమారం రేపింది. పట్టణంలోని జీఎంకే ట్రస్ట్ కార్యాలయంలో చైర్మన్ ముజీబ్ఖాన్ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు లక్కీ డ్రా తీసారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మంది పేద మైనార్టీలకు ఇళ్లు ఇస్తామని చెప్పారని ట్రస్ట్ ప్రతినిధులు గుర్తు చేశారు. ఒకే వర్గానికి 200 ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ బీజేపీ కౌన్సిలర్ కిరణ్ మండిపడ్డాడు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు ఎవరూ లేకుండా డ్రా ఎలా నిర్వహిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ ప్రశ్నించారు. తాండూరులో 25 వేల మంది మైనార్టీలు ఉన్నారని.. 200 ఇళ్లు ఇస్తే ఎలా అని నిరుపేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇందిరమ్మ ఇళ్ల పంచాయతీ నెలకొంది. అయితే జీఎంకే ట్రస్ట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించలేదని.. కేవలం దరఖాస్తులు స్వీకరించామని మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్ రెడ్డి పత్రిక ప్రకటనలో విడుదల చేశారు. ప్రతిపక్షాలు ఓర్వలేక అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల, జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యే స్పందన కోసం మున్సిపల్ వాసులు వేచి చేస్తున్నారు.
ఎమ్మెల్యే, అధికారులు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించడంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల ఆగ్రహం
దరఖాస్తులు మాత్రమే స్వీకరించామని చెబుతున్న అధికార కాంగ్రెస్ నేతలు


