హయత్నగర్: హైడ్రా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం పనిచేస్తూ కాలనీ ప్రహరీని కూల్చి వేస్తారా అంటూ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. నాగోల్ సర్కిల్ పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ పరిధిలోని ప్రజయ్ గుల్మోర్ కాలనీ ప్రహరీని హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. కూల్చి వేసిన ప్రహరీని ఆదివారం మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడున్నర ఎకరాల్లో పక్కనే ఉన్న ఖార్ఖానా కుంట చెరువు కబ్జాకు గురై రెండు ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు. దానిని కాపాడలేని హైడ్రా అధికారులు ప్రహరీని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. హైడ్రా పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు కృపాసాగర్, శివరామకృష్ణ పాల్గొన్నారు.


