పరిగి: హిందువులంతా కులాలకు అతీతంగా ఏకం కావాలని వీరధర్మజస్వామీజీ సూచించారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని మినీస్టేడియంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. భారత దేశానికి హిందూ మతం ఆత్మలాంటిదని.. అన్ని మతాల వారు హిందూ మూలల నుంచి వచ్చిన వారే వివరించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసి, సమైక్య పరచి మన దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. హిందువు అనేది మతం కాదని.. ఒక జాతి అని అన్నారు. దేశంలో హిందూ వ్యతిరేక శక్తులు పన్నుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు హిందులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతే దేశ భద్రతకు బలమన్నారు. పండుగలను గ్రామాల్లో, పట్టణాల్లో హిందువులంతా ఐక్యంగా ఉండి నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు హన్మంతుముదిరాజు తదితరులు పాల్గొన్నారు.
వీరధర్మజస్వామీజీ


