అవగాహన లేక.. బుకింగ్ తెలియక
● యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులు
● ఫర్టిలైజర్ యాప్ రద్దు చేయాలి
● పాత పద్ధతిలోనే ఇవ్వాలి: సీపీఎం
అనంతగిరి: ‘యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫర్టిలైజర్ యాప్పై అవగాహన లేక.. ఆన్లైన్లో బుక్ చేసుకోలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యూరియా విక్రయం కోసం వ్యవసాయ శాఖ తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ను వెంటనే రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే సరఫరా చేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలసి వికారాబాద్లోని పలు యూరియా దుకాణాలను సందర్శించారు. రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకు ముందులాగే రైతులకు పాస్బుక్, ఆధార్కార్డులపై ఎరువులు, పిచికారీ ముందులు సరఫరా చేయాలని సూచించారు. యూరియాను అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియాను ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారిలో చాలా మంది వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, ఒక వేళ ఉన్నా ఆన్లైన్ గురించి అంతగా తెలియదని చెప్పారు. డిమాండ్కు సరిపడా యూరియా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


