పుష్కరిణిలో మృతదేహం లభ్యం
చేవెళ్ల: వలస కూలీని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపి పుష్కరిణిలో పడేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కందవాడలో కరుణాకర్ అలియాస్ కర్నయ్య(60) అనే తమిళనాడుకు చెందిన వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన కొన్నేళ్ల క్రితమే వలసొచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉండేవాడు. అతని భార్య గతంలోనే చనిపోవటంతో కందవాడకు చెందిన బాలమణితో పరిచయం ఏర్పడటంతో ఆరేళ్లుగా ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఉత్సవాలకు గురువారం ఇద్దరు వచ్చారు. సాయంత్రం కలిసి మద్యం, కల్లు తాగి వెళ్లిపోయారు. రాత్రి ఏం జరిగిందోగాని ఆయన ఉదయం పుష్కరిణిలో శవమై తేలాడు. శుక్రవారం ఉదయం మృతదేహం తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై రక్తగాయలు ఉండటంతో కర్రతో కొట్టి చంపి పుష్కరిణిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రక్తపు మరకలతో ఉన్న కర్ర లభించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్తో వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కొట్టి చంపి పడేసినట్లు ఆనవాళ్లు


