
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షాలకు నీరంతా గదుల్లోకి చేరి విలువైన రికార్డులు తడిసిపోయేవి. తాజాగా పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంతన్గౌరెల్లిలో భవన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. నందివనపర్తిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు
తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ, ధర్మన్నగూడ, కేసీతండా, తక్కళ్లపల్లి తండా, అయ్యవారిగూడెం గ్రామాల్లోనూ నూతన పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ గ్రామాల్లో ఏళ్ల కింద నిర్మించిన భవనాలుండగా కేసీతండా, ధర్మన్నగూడెం, అయ్యవారిగూడెం, తక్కళ్లపల్లి తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల్లోనే పాలన కొనసాగుతుండగా, శాశ్వత భవన నిర్మాణాల కోసం నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్త పంచాయతీలకు సైతం శాశ్వత భవనాలు ఉంటాయని మండల పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు.
నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాలకు ఈజీఎస్ నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు
మరో ఏడు గ్రామాలకు ప్రతిపాదనలు
త్వరలో ప్రారంభిస్తాం
నందివనపర్తిలో ఏళ్ల కింద నిర్మించిన ఇరుకై న గదిలోనే పాలన కొనసాగిస్తున్నాం. సమావేశాల సమయంలో ఇబ్బంది అవుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, ఇతర సిబ్బంది వచ్చినప్పుడు కష్టంగా విధులు నిర్వర్తిస్తున్నాం. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– ఈర్లపల్లి శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి, నందివనపర్తి