11,801 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

11,801 దరఖాస్తులు

Jun 22 2025 7:23 AM | Updated on Jun 22 2025 7:23 AM

11,80

11,801 దరఖాస్తులు

భూ సమస్యల పరిష్కారం కోసం భారీగా అర్జీలు
● జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● పీఓబీ, డేటా సవరణ సమస్యలే అధికం ● ఇందులో ఎక్కువగా కలెక్టర్‌ పరిధిలోకి వచ్చేవే.. ● కోర్టు కేసుల్లో ఉన్నవి అనేకం

వికారాబాద్‌: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి ఈ నెల 2 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. 3వ తేదీ నుంచి గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 19 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగింది. ఈ నెల 20తో సదస్సులు ముగిశాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కొంత కాలంగా శ్రమిస్తున్నా అనేక సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా నిర్వహించిన భూ భారతి సదస్సులకు రైతుల నుంచి వచ్చిన అర్జీలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వ్యాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన అర్జీలను ఆగస్టు 14వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది కొంత కష్టసాధ్యమేనని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు అంటున్నారు.

పెండింగ్‌లో అనేక సమస్యలు

కొంత కాలంగా అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం కుస్తీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. తన లాగిన్‌లో ఐదువేలు ఉన్న అర్జీలను 500 లోపు తెచ్చామని ఇటీవల కలెక్టర్‌ ప్రకటించిన విషయం తెలిసింది. రెవెన్యూ సదస్సులతో మళ్లీ వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా మిస్సింగ్‌ సర్వే నంబర్‌, సాదాబైనామా, అసైన్డ్‌ భూముల సమస్యలు, పీఓబీ, విరాసత్‌, మ్యుటేషన్‌, డేటా కరక్షన్‌ తదితర సమస్యలకు సంబంధించినవి అధికంగా వచ్చాయి. ధరణి చట్టం ప్రకారం మెజార్టీ భూ సమస్యల పరిష్కారం కలెక్టర్‌ లాగిన్‌లోనే ఉండగా తాజా చట్టంతో చాలా వరకు అధికార వికేంద్రీకరణ జరిగిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. సగానికి పైగా సమస్యలు అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డీఓలు పరిష్కరించేలా చట్టాన్ని రూపొందించారు. దీంతో భూ సమస్యల పరిష్కారం వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భారీగా దరఖాస్తులు

జిల్లా వ్యాప్తంగా గడిచిన 19 రోజుల్లో 475 గ్రామాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతుల నుంచి 11,801 దరఖాస్తులు వచ్చాయి. 5,294 అర్జీలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. 1,141 మంది రైతులకు నోటీసులు కూడా అందజేశారు. ఇందులో 342 అర్జీలను అనుమతించగా ఆయా కారణాలతో 31 దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా వాటిని మ్యాన్యువల్‌ వర్క్‌ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు

మండలం పేరు దరఖాస్తులు

వికారాబాద్‌ 1,531

కుల్కచర్ల 1,424,

పూడూరు 1,259

దోమ 1,104

మోమిన్‌పేట 1,018

యాలాల 137

బషీరాబాద్‌ 155

పెద్దేముల్‌ 205

సదస్సులు విజయవంతం

అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేశాం. భూ సమస్యల పరిష్కారం కోసం పదివేలకు పైగా అర్జీలు వచ్చాయి. ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రక్రియ సాగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తాం. గతంలో రైతులు పెట్టుకున్న సాదాబైనామా సమస్యలకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నందున ఆ స్టే వెకెంట్‌ అయ్యాక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అవి పరిష్కరిస్తాం. ఇవి మినహా మిగతా సమస్యలన్నీ ఆగస్టు 14వ తేదీలోగా పరిష్కరిస్తాం.

– ప్రతీక్‌జైన్‌, కలెక్టర్‌

11,801 దరఖాస్తులు 1
1/1

11,801 దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement