
నిండుగా నీళ్లు.. భూములు బీళ్లు
మోమిన్పేట: నందివాగు ప్రాజెక్టును పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో తూములు తుప్పుపట్టి, కాల్వలు పూడుకుపోయి, గండ్లుపడ్డాయి. 2,650 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు వైపు పాలకులు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా రైతు భూములన్నీ బీడుగా మారాయి. ఈ ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విదల్చక కాస్లాబాద్, బూర్గుపల్లి, మేకవనంపల్లి, రాళ్లగూడుపల్లి, మెదక్ జిల్లా, కొడాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్, జాజిపురం, దాని అనుబంధ తండాల భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఈ ఆయకట్టుకింద గతంలో రెండు పంటలు పండిచిన రైతులు.. 15 ఏళ్లుగా సాగునీరందక ఇబ్బంది పడుతున్నారు.
కమిటీలు లేవు.. నిధులు రావు
ప్రతీ సంవత్సరం బడ్జెట్లో నిధుల కేటాయిస్తారేమోనని ఎదురు చూడడం తప్పితే ప్రభుత్వాలు పట్టించుక్ను పాపాప పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు పూడికతీత, గండ్ల పూడ్చివేత, తూములు, పక్కగోడలు పూర్తిస్థాయిలో నిర్మించాలంటే రూ.10 కోట్లు అవసరమవుతాయని రైతులు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తేనే పంటలసాగుకు అవకాశం ఉంటుందని.. ప్రభుత్వంస్పందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
రూ.5 కోట్లతో ‘మిషన్ కాకతీయ’
మిషన్ కాకతీయలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 కోట్లతో పనులు చేపట్టినా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించ లేకపోయింది. నిండుగా పూడుకుపోయిన శిఖంలో మట్టితీత పనులే ఎక్కువ చేయడం వలన కాల్వల మరమ్మతులు మిగిలిపోయాయి. పాలక వర్గాలు లేక ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుగా నీరున్నా సాగుకు అందక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఎడమ, కుడి కాల్వలో పెరిగిన తుంగను సగం మేర తొలగించుకున్నా సరిగా నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టపై చెట్ల పొదలు ఏపుగా పెరిగాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
నందివాగుపై నిర్లక్ష్యపు నీడ
ఇబ్బంది పడుతున్న ఆయకట్టు రైతులు
పట్టించుకోని పాలకులు, అధికారులు

నిండుగా నీళ్లు.. భూములు బీళ్లు