
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు,బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ పరిపాలనలో శిక్షణకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్చే గుర్తించిన ఇన్స్టిటూషన్స్, సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ లేదా ఇన్ కార్పొరేషన్ చేసిన లేదా స్థాపించబడిన దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి ఏదేని ఫ్యాకల్టీలో బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొందిన వారు అర్హులని తెలిపారు. వార్షికాదాయం రూ.2 లక్షలు మించొద్దని, అభ్యర్థి గత సంవత్సరంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండకూడదని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులు న్యాయ పరిపాలనలో మూడేళ్ల వ్యవధికి శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.3వేలు స్టయిఫండ్, మొదటి సంవత్సరం లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జిల్లా కోర్టులు, మొబైల్ కోర్టులు, సెషన్ కోర్టు, డివిజన్ స్థాయి, తాలుకా స్థాయి కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 30న ఒరిజినల్ సర్టిఫికెట్లతో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.