
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను స్థానిక విలేకరులకు అందజేశాడు. ఈ నెల 4న గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్లాటు విషయమై అధికారులతో మాట్లాడుతున్న సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్య, జెట్ట రవి, జెట్ట హరీశ్ తనను గ్రామస్తుల సమక్షంలోనే కులం పేరుతో దూషించి, అవమానపరిచి, బెదిరించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని రోజులుగా తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న శంకరయ్య, రవి, హరీశ్లపై విచారణ జరిపి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు