ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
తిరుపతి క్రైం: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ సమగ్ర భద్రతా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు బుధవారం తిరుపతి నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్ల ను సమీక్షించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై కఠిన నిఘా పెట్టాలని, పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద గుంపులు గుమికూడకుండా చర్యలు చేపట్టాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో అపోహలు, తప్పుడు ప్రచారం, ప్రశ్నపత్రాలపై అసత్య వార్తలు వ్యాప్తి చెందకుండా సైబర్ విభాగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరుతూ, తల్లిదండ్రులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.


