
కూటమి నేత ఇంటి వద్దే ఇసుక విక్రయాలు
● స్వర్ణముఖి నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ
సాక్షి, టాస్క్ఫోర్స్ : పట్టపగలే ఓ కూటమి నేత ఇంటి వద్ద భారీ ఇసుక డంపు చేసి, యథేచ్ఛగా ఇసుక విక్రయాలు చేస్తుండడం విశేషం. మండల పరిధిలోని ఏ.రంగంపేటకు చెందిన పంచాయతీ నాయకుడు అనే చెప్పుకునే ఓ నేత రాత్రి వేళల్లో జేసీబీ సాయంతో స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడు. అధికార పార్టీ అండ దండలతో వందల లోడ్లు అక్రమంగా దోచుకోవడంతో పాటు ఇసుకను తన స్వంత ఇంటి వద్దే డంపు చేస్తున్నారు. అలా డంపు చేసిన ఇసుకను డిమాండ్ బట్టి భారీగా విక్రయాలు సాగిస్తున్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాలో పోలీసు, రెవెన్యూ శాఖలోని కొంత మంది సహకారం సంపూర్ణంగా అందుతోందనే ఆరోపణలు లేకపోలేదు. వారం వారం అధికారులకు వాటాలు వెళ్లడంతోనే జాతీయ రహదారికి ఆనుకుని జరుగుతున్న ఇసుక స్మగ్లింగ్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సంజన
బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంజన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రమణయ్య తెలిపారు. జులై 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని చంఢీగఢ్లో జరిగిన అండర్–17 విభాగంలో ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని సంజనను హెచ్ఎం రమణయ్య, పీడీలు మస్తానయ్య, హరిబాబు అభినందించారు. విద్యార్థిని కబడ్డీ పోటీలలో పాల్గొనడానికి సహకారం అందించిన మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పొదుపు సంఘాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
తిరుపతి అర్బన్ : అవినీతి అక్రమాలకు తావులేకుండా మహిళా పొదుపు సంఘాలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి రామానుజ సర్కిల్లోని ఓ హోటల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూన్కు రాష్ట్రంలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ఆగస్టు చివరిలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. పొదుపు సంఘాల నిర్వహణ పటిష్టంగా ఉండాలని సూచించారు. డీఆర్డీఏ పరిధిలో (రూరల్) 34 వేల సంఘాల్లో 3.40 లక్షల మంది సభ్యులు, మెప్మా పరిధిలో(అర్బన్) 13వేల సంఘాల్లో 1.30 లక్షల మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో వారి అభివృద్ధిపై డీఆర్డీఏతోపాటు మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబుతోపాటు పలువురు డీఆర్డీఏ ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
1200 ఓట్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రం
తిరుపతి అర్బన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 ఓట్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఉన్నాయని డీఆర్వో నరసింహులు తెలిపారు. గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1200 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి...162 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా జిల్లాలో 33 పోలింగ్ కేంద్రాలను మార్పు చేస్తున్నామని, 8 పోలింగ్ కేంద్రాలకు పేర్లు మార్చుతున్నామని, ఓట్లు తక్కువగా ఉన్న రెండు పోలింగ్ కేంద్రాల్లో ఒక్కటిగా చేయడానికి నాలుగు పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వివరించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏ రాజకీయ పార్టీకి అయినా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాత్రమే ఎప్పటికప్పుడు సరిచేస్తామని స్పష్టం చేశారు.

కూటమి నేత ఇంటి వద్దే ఇసుక విక్రయాలు

కూటమి నేత ఇంటి వద్దే ఇసుక విక్రయాలు