
వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్
వాకాడు: వాకాడు తహసీల్దార్ రామయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ రామయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపిస్తూ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. బాధిత మహిళా వీఆర్వో కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామయ్యను సస్పెండ్ చేశారు. ఆరోపణలపై విచారణ అధికారిగా లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్ను నియమించారు.
ప్రభుత్వ కళాశాలకు
కంప్యూటర్ల వితరణ
చంద్రగిరి : స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఓ దాత గురువారం కంప్యూటర్లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థినుల ఉన్నతి కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త, అమ్మార్ట్స్ సంస్థ చైర్మన్ దశరథ రెడ్డి కొన్నేళ్లుగా తన ఔదర్యాన్ని చాటుకుంటున్నారన్నారు. దాత దశరథ రెడ్డి తన సొంత సంస్థ ద్వారా 15 కంప్యూటర్లు, 15 కంప్యూటర్ డెస్క్లు, 15 కుర్చీలను విరాళంగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు 5 కంప్యూటర్లు వితరణ చేశారన్నారు. అనంతరం దాత దశరథరెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపల్ ప్రకాష్, బాలికల కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
8న సామూహిక వరలక్ష్మి వ్రతం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉపాలయమైన బ్రహ్మగుడి ఆవరణలో 8వ తేదీ శుక్రవారం సామూహిక వ్రతం నిర్వస్తున్నట్లు ఈఓ బాపిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 7 గంటల నుంచి వ్రతం ప్రారంభమవుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూ పార్క్ రోడ్లోని అటవీ ప్రాంతంలో సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు గల ఓ పురుషుడు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు అన్నది.. తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా అలిపిరి లగేజీ సెంటర్ వద్ద సుమారు 55 సంవత్సరాలు గల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల ఆచూకీ తెలిస్తే.. వెస్ట్ పోలీసులను సంప్రదించాలన్నారు.
నీటి సంపులో పడి కార్మికుడి మృతి
నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధి ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు శ్రీరామ్(21) గురువారం ప్రమాదవఽశాత్తు నీటి సంపులో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గుంటూరుకు చెందిన శ్రీరామ్ రెండేళ్లుగా బ్రేక్స్ ఇండియా పరిశ్రమలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతను వెంకటగిరిలో నివాసం ఉంటూ ప్రతిరోజూ పరిశ్రమకు వస్తుంటాడు. గురువారం విధులకు హాజరై నీటి సంపు సమీపంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. చాలా పైనుంచి సంపులో పడిపోయిన శ్రీరామ్ను అక్కడి కార్మికులు గుర్తించి బయటకు తీసి హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. శ్రీరామ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ బాబి వైద్యశాలకు వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పరిశ్రమ వద్దకు వెళ్లి నీటి సంపు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్