ఆషాడంతో పెరిగే అను‘బంధం’

Why Wife And Husband Are Separated In Ashadha Masam - Sakshi

విద్యానగర్‌(కరీంనగర్‌) పెళ్లయిన కొత్త దంపతులు ఆషాడంలో నెల రోజుల పాటు విడిగా ఉండాలనే నిబంధన వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తొలకరి వర్షాల అనంతరం వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. సాగు పనుల్లో కుటుంబ సభ్యులందరూ భాగస్తులయ్యేవారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేసే అవకాశం ఉండదనేది ఒక కారణం. మరో కోణంలో... ఆషాడ∙మాసంలో గ ర్భం దాల్చితే ప్రసవ సమయానికి ఏప్రిల్‌ నెల (ఛెత్రమాసం) వస్తుంది. 

ఎండలు మండే ఈ కాలంలో ప్రసవం జరిగితే లేత శిశువు తట్టుకోలేదని, తల్లీ బిడ్డల ఆరోగ్యం ప్రభావితమవుతుందని ఈ నియమాన్ని విధించారు. పైగా నెల రోజుల ఎడబాటు భా ర్యభర్తల మధ్య అనురాగబంధాన్ని మరింత పెంచుతుందనేది కూడా మరో కారణం. అయితే వివాహమైన తొలి ఏడాదిలో వచ్చే ఆషాడంలో కొత్త జంట కలిసి ఉండకూడదనే నియమం అనాది నుంచి ఆచరణలో ఉంది. అత్తా, కోడళ్లు ఒకే  గడప దాటరాదని, ఒకరినొక్కరు చూసుకోరాదనే నిబంధనను ఇప్పటికీ అనుసరిస్తుండగా.. ఆషాడంలో ఎడబాటుపై కొత్త దంపతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..


ఆచారాలు మంచివే..
మన ఆచారాలు, సంప్రదాయాలు మంచివే. వాటిని ఆచరించడం కూడా మంచిదే. శాస్త్రీయతతో కూడిన మన ఆచారాలు పాటించాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది.      
 – నాగుల అనిల్‌కుమార్‌–శ్రీజ, మంకమ్మతోట, కరీంనగర్‌


ఉద్యోగాలరీత్యా సాధ్యం కాదు
ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలరీత్యా దూరంగా ఉండడం కొంచం కష్టమే. నెలరోజుల సెలవులంటే సాధ్యం కాదు. మెట్టింటి వారికి దూరమే కనుక ఆషాడ సంప్రదాయం పాటిస్తున్నట్లే కదా.
– తాల్లం సతీశ్‌–రవళి, భగత్‌నగర్, కరీంనగర్‌

ప్రేమ పెరుగుతుంది
దూరం ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. అనుబంధాలు మరింత గట్టిపడుతాయి. ఒక్కరి గురించి ఒక్కరు ఆ లోచించే సమయం లభిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి.      
– సంగోజు మనీశ్‌–మౌనిక, జ్యోతినగర్, కరీంనగర్‌

ఎడబాటు మంచిదే..
పెళ్లి తర్వాత కొంత ఎడబాటు మంచిదే. మాములుగా అంతే ఎడబాటు ఎవరు ఆచరించరని ఆషాఢం మంచిది కాదనే వాడుకలోకి పూర్వీకులు తీసుకొచ్చారు. ఏదైనప్పటికీ దూరం అనుబంధాన్ని పెంచుతుంది.–
పీసర మహేందర్‌–దీపిక, చింతకుంట, కరీంనగర్‌

శాశ్వత బంధానికి పునాది అవుతుంది
శాస్త్రీయ నియమాలతో రూపొంది, అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. ఆషాడ మాసం నవ దంపతులకు జీవన మాధుర్యాన్ని రెట్టింపు చేస్తుంది. విరహంతో అనురాగబంధం ద్విగుణీకృతమవుతుంది. వివాహమనే శాశ్వత బంధానికి ఆషాఢంలో ఎడబాటు మంచి పునాది అవుతుంది. 
– పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్‌
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top