బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్‌ | Vivek Venkata Swamy Konda Vishweshwar Gives Clarity On party Change | Sakshi
Sakshi News home page

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్‌

Oct 5 2023 8:53 AM | Updated on Oct 5 2023 9:02 AM

Vivek Venkata Swamy Konda Vishweshwar Gives Clarity On party Change - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అసంతృప్త నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిలో కొందరి స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. తాను బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా చెబుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు డా.జి.వివేక్‌ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పారు.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కలిశానని, మంగళవారం నిజామాబాద్‌ సభ అప్పుడు మాత్రం.. తమ అంబేడ్కర్‌ కాలేజీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యఅతిథి ఖరారు కోసం ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా చెప్పారు. బీజేపీ నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తమ బలహీనతలను కాంగ్రెస్‌ నేతలు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు.

మరికొంతమంది
ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డిలను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా వారు స్పందించలేదు.   

తర్జనభర్జన! 
కాంగ్రెస్‌ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారి స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement