వారాంతంలో గ్రూప్‌–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్‌పీఎస్సీ! | TSPSC Group-1 Preliminary Key This Week | Sakshi
Sakshi News home page

వారాంతంలో గ్రూప్‌–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్‌పీఎస్సీ!

Oct 24 2022 9:12 AM | Updated on Oct 24 2022 3:01 PM

TSPSC Group-1 Preliminary Key This Week - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్‌ జవాబు పత్రాలను వారి ఓటీఆర్‌ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్‌ జవాబు పత్రాల స్కానింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్‌ పూర్తయినట్లు సమాచారం.

దీపావళి పండుగ తర్వాత స్కానింగ్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు  ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. 

శుక్రవారం నాటికి స్కానింగ్‌ పూర్తి!
ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్‌ జవాబు పత్రాల స్కానింగ్‌ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్‌ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్‌ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

స్కానింగ్‌ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్‌ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్‌ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్‌ కీని విడుదల చేస్తారు.
చదవండి: కాలుష్యానికి చెక్‌.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..!

Advertisement
 
Advertisement
Advertisement