మరిన్ని రైళ్లు.. మరింత వేగం | Third Railway Line Between Kazipet And Balharshah Is Approaching | Sakshi
Sakshi News home page

మరిన్ని రైళ్లు.. మరింత వేగం

Nov 4 2021 1:45 AM | Updated on Nov 4 2021 1:45 AM

Third Railway Line Between Kazipet And Balharshah Is Approaching - Sakshi

మూడో లైన్‌లో భాగంగా నిర్మించిన భారీ వంతెన 

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే లైన్‌ పరంగా అనుసంధానించే అతికీలక గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో భాగంగా ఉన్న కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వే లైన్‌ వేగంగా అందుబాటులోకి వస్తోంది. మార్చి నాటికి ప్రా జెక్టులో సగభాగం అందుబాటులోకి రాబోతోంది. అందులో ఈ నెలాఖరుకు 20 కి.మీ. లైన్‌ మీదుగా రైళ్లను నడిపేందుకు వీలుగా కొత్త లైన్‌ను పాత ట్రాక్‌తో అనుసంధానించే నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు ప్రారంభించారు.

234 కి.మీ. ప్రాజెక్టులో సగం ప్రాంతం అందుబా టులోకి రావడం పెద్ద ఊరటగా భావించొచ్చు. ఇప్పటికే సామర్థ్యానికి మించి రైళ్లను నడు పుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమా దాలు జరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఇక దూరం కానుంది. దీంతోపాటు మరిన్ని రైళ్లను నడిపేందుకూ వీలు కలుగుతుంది. అన్నింటికి మించి రైళ్ల వేగం కూడా పెరగనుంది. 

రూ.2,063 కోట్లతో పనులు
గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో కాజీపేట తర్వాత వచ్చే మహారాష్ట్రలోని బల్లార్షా మీదుగా నిత్యం 300 వరకు రైళ్లు (కోవిడ్‌కు ముందున్న పరిస్థితి) పరుగుపెడుతున్నాయి. ట్రాక్‌ సామర్థ్యానికి మించి 130 శాతం మేర రైళ్లను నడుపుతున్నారు. పైగా కాజీపేట–బల్లార్షా మధ్య సిమెంటు కర్మాగారాలు, బొగ్గు గనులు భారీగా ఉన్నాయి. రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సిమెంటు, బొగ్గు తరలింపు ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. సాధారణంగా ప్రయాణికుల రైళ్లకు రూట్‌ క్లియర్‌ చేసేందుకు సరుకు రవాణా రైళ్లను లూప్‌లైన్లలో ఆపేస్తారు.

కానీ ఈ మార్గంలో సరుకు రవాణా రైళ్లకే ప్రయాణికుల రైళ్లకు రెడ్‌సిగ్నల్‌ ఇచ్చి రూట్‌ క్లియర్‌ చేస్తుంటారు. దీంతో 2015–16లో మూడో లైన్‌ ప్రాజెక్టును రూ.2,063 కోట్లతో ప్రారంభించారు. 235 కి.మీ. నిడివిలో రాఘవాపురం–మందమర్రి మధ్య 34 కి.మీ. మధ్య మూడో లైన్‌ను పూర్తి చేసి గతంలోనే ప్రారంభించారు. రాఘవాపురం–మంచిర్యాల మధ్య ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. రాఘవాపురం–కొలనూరు–పోత్కపల్లి సెక్షన్‌ల మధ్య 31 కి.మీ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు పనులు పూర్తయిన ప్రాంతాల్లో మూడోలైన్‌ను పాతలైన్లతో అనుసంధానించే నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు ప్రారం భించారు.

ఇందులో వీరూర్‌–మాణిక్‌ఘర్‌ మధ్య నిర్మించిన మూడోలైన్‌ ఈ నెలాఖరు నుంచి వినియోగంలోకి రానుంది. మూడో లైన్‌ అందుబాటులోకి వస్తే వెంటనే అదనపు రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు సిద్ధంగా ఉంది. ఇక ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో సరుకు రవాణాపై అధికంగా దృష్టి సారించిన రైల్వే బోర్డు, మూడో లైన్‌ను గరిష్టస్థాయిలో గూడ్సు రైళ్లకు వినియోగించాలని భావిస్తోంది. అప్పుడు మిగతా రెండు లైన్లపై ప్రయాణికుల రైళ్లు అవాంతరాలు లేకుండా సాఫీగా పరిగెత్తేందుకు మార్గం సుగమమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement