జల్దీ ఇల్లు కట్టుకోండి! | Telangana govt to construct 20 lakh Indiramma houses in five years | Sakshi
Sakshi News home page

జల్దీ ఇల్లు కట్టుకోండి!

Jun 14 2025 12:29 AM | Updated on Jun 14 2025 12:29 AM

Telangana govt to construct 20 lakh Indiramma houses in five years

భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లో ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను పరిశీలిస్తున్న గృహనిర్మాణ సంస్థ సీఈ చైతన్యకుమార్, స్థానిక అధికారులు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కోరుతున్న అధికారులు

ఇళ్ల వద్దకు బృందాలుగా వెళ్లి మరీ విన్నపాలు

భారీ వర్షాలు మొదలైతే పనులు సాగవని ఆందోళన

ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సర్కారు లక్ష్యం

మొదటి విడతలో 4.50 లక్షలకు మొదలైనవి 69 వేలే

రెండో ఏడాది మొదలు పెట్టాల్సినవి మరో 4.50 లక్షలు

ఇప్పటివరకు పూర్తిగా నిర్మాణమైన ఇళ్లు రెండు మాత్రమే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల కోసం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటికి పనులు మొదలైనవి 69 వేలు మాత్రమే. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి రెండో సంవత్సరం కొనసాగుతుండటంతో మరో 4.50 లక్షల ఇళ్ల నిర్మా ణానికి కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.

అసలే పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండగా, ప్రస్తుతం వానాకాలం కూడా మొదలు కావటంతో ఇళ్ల నిర్మాణం మరింత మందగించనుంది. భారీ వర్షాలు ప్రారంభమైతే అసలు పనులే చేపట్టేందుకు జనం ఆసక్తి చూపరు. వ్యవసాయ పనులు ఊపందుకుంటే పనుల్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. 

పూర్తయిన ఇళ్లు రెండే..
కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలి నుంచే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేస్తుండటంతో నెల రోజులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 69 వేల ఇళ్లు మాత్రమే మొదలయ్యాయి. వాటిల్లో పూర్తయినవి రెండు మాత్రమే. 15 వేల ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది.

ఇందులో 10 వేల ఇళ్లకు సంబంధించి తొలి విడత బేస్‌మెంట్‌ లెవల్‌ నిధులు రూ.లక్ష చొప్పున విడుదల కాగా, మూడు వేల ఇళ్లకు రెండో విడత, మరో రెండు వేల ఇళ్లకు గోడలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులకు ఇబ్బంది లేదని, ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 

భారీ వర్షాలు పడితే ఇసుకకూ కష్టమే..
రాష్ట్రంలో వానాకాలం మొదలు కావటంతో భారీ వర్షాలు కురిస్తే ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలేర్పడతాయని అధికార యంత్రాంగం భయపడుతోంది. దీంతో వర్షాలు ఊపందుకోక ముందే వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ ఇళ్లకు కావాల్సిన ఇసుకను వాగులు, వంకల నుంచి సేకరించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారీ వర్షాలు కురిసి వాగులు నీటితో నిండిపోతే ఇసుక సేకరణ కూడా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే వీలైనంత మందికి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. అది జరగాలంటే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి. ఇందుకోసం బృందాలుగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement