ఆ ఎంపీడీవో నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ ఉద్యోగులే.. మరో చెల్లె, తమ్ముడు..

Telangana: Family Full Government Employees Bhainsa - Sakshi

అన్నయ్య భైంసా ఎంపీడీవో 

తోబుట్టువులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే

ఇందులో ఇద్దరు లెక్చరర్లు.. ఇద్దరు టీచర్లు

సాక్షి,భైంసా(అదిలాబాద్‌): భైంసా ఎంపీడీవోగా పనిచేస్తున్న అర్ల గంగాధర్‌ తోబుట్టువులంతా ప్రభుత్వ కొలువులు సాధించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని భాగ్యనగర్‌కాలనీలో అర్ల గంగాధర్‌ కుటుంబం నివసిస్తుంది. బోథ్‌ మండలం సొనాల గ్రామానికి చెందిన అర్ల గంగారం–లక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. ఇందులో పెద్దవాడైన గంగాధర్‌తోపాటు అందరినీ ఈ దంపతులు చదివించారు. అర్ల గంగారాం కోపరేటివ్‌ బ్యాంకులో పనిచేసేవారు.

లక్ష్మి నిరక్ష్యరాసురాలు. అందరిలో పెద్దవాడైన గంగాధర్‌ 2001–05వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత గ్రూప్‌–2 ఉద్యోగం సాధించాడు. 2017 మార్చి 1 నుంచి అక్టోబర్‌ 15 వరకు నిర్మల్‌ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశాడు. ఆయన సహచరిని కరుణశ్రీ మల్లాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గంగాధర్‌ అటు తర్వాత మళ్లీ ఎక్సైజ్‌శాఖలో కూడా కొలువు సాధించాడు. మూడు ఉద్యోగాలు సాధించిన గంగాధర్‌ తన తోబుట్టువులైన ఐదుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడిని సైతం చదివించాడు. నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించగా మరో చెల్లె, తమ్ముడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధిస్తామని చెబుతున్నారు.

డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా 
నాలుగవ చెల్లె భాగ్యలక్ష్మి ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా కొలువు సాధించింది. ఎంతో కష్టపడి చదివి లెక్చరర్‌గా ఎంపికైంది. చిన్నతనం నుంచి అక్కయ్యలతో కలిసి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సాధించింది. 
– భాగ్యలక్ష్మి, ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల లెక్చరర్‌ ఆదిలాబాద్‌

ప్రైవేటు అధ్యాపకుడిగా
గంగాధర్‌ తమ్ముడు శశిధర్‌ ఎంఏ బీఎడ్‌ పూర్తిచేశాడు. ఈయన ప్రైవేటు డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అన్నయ్య సహకారంతోనే చదువు పూర్తిచేశాడు. ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధించి తీరుతానని చెబుతున్నాడు. కుటుంబంలో ఉన్నవారంతా ఉద్యోగాల్లో ఉన్నారని ఇక తాను కూడా ఉద్యోగం సాధిస్తానని చెబుతున్నాడు.
– శశిధర్, ప్రైవేటు డిగ్రీ కళాశాల లెక్చరర్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 
ఐదవ చెల్లె ఉదయరాణి ఖమ్మం ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షి యల్‌ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా రు. 2019లో జూనియర్‌ లెక్చరర్‌గా కొలువుసాధించిన ఉదయరాణి ఏడాదిలోనే మళ్లీ డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైంది. చదువులో చురుకుగా ఉండే ఉదయరాణి గ్రూప్‌–1కు సైతం సిద్ధమవుతుంది.                        
– ఉదయరాణి, ఖమ్మం డిగ్రీ కళాశాల లెక్చరర్‌

కష్టపడితేనే ఫలితం 
మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. ఐదుగురు చెల్లెళ్లు్ల, తమ్ముడిని కష్టపడి ఉన్నత చదువులు చదివించాం. నలుగరు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఈ నోటిఫికేషన్‌లో నా తోబుట్టువుల్లో మిగిలి ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారని నమ్మకం ఉంది. కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. ఎంత పోటీ ఉన్న ప్రతిభ ఉన్న వారికి కొలువులు వచ్చితీరుతాయి. 
 – అర్ల గంగాధర్, ఎంపీడీవో భైంసా

అంగన్‌వాడీ టీచర్‌గా
గంగాధర్‌ మొదటి చెల్లె గంగామణి కుభీర్‌ మండలం చొండి అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఉపాధ్యాయురాలిగా అన్నింటిల్లోనూ ముందువరుసలో ఉంటుంది. ఆమె పనితీరుకు మెచ్చి ఐసీడీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం సన్మానించారు. 

కోచింగ్‌ ఇస్తూ 
రెండవ చెల్లె సంతోషిణి ఎంఏ బీఎడ్‌ పూర్తిచేసింది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న సంతోషిణి ప్రతిఏటా గురుకుల పాఠశాలలో నిర్వహించే ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌ ఇస్తుంది. సంతోషిణి వద్ద కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులంతా ఉద్యోగాలు సాధించారు. 
 – సంతోషిణి, ప్రైవేటు ఉపాధ్యాయురాలు

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా 
మూడవ చెల్లె లావణ్య ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సొనాలలో కష్టపడి చదువుకున్న లావణ్య పెద్దన్న గంగాధర్‌ సహకారంతో ఉద్యోగాన్ని సాధించింది. అన్నయ్య చెప్పిన విధంగా నడుచుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ గ్రూప్‌–2కు సైతం సిద్ధమవుతుంది. 
 – లావణ్య, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

చదవండి: Pub Drugs Case: డ్రగ్స్‌ అమ్మేది వాళ్లే.. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కీలక వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top