ఎజెండాకే పరిమితం
నేడు అసెంబ్లీ సమావేశం
14న శాసనమండలి భేటీ
కేబినెట్ ఆమోదించిన మూడు సవరణ బిల్లులపై చర్చ
ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్, మండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్లతో ఫోన్ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఫోన్లో సూచించారు.
ఎజెండా అంశాలే...
మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమై నేరుగా ఎజెండాపై చర్చిస్తుంది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నాలా, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ 1955 చట్టాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది.
అనుమానితులకు కరోనా పరీక్షలు
ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయిం చుకోవాలని మండలి చైర్మన్ గుత్తా, శాసన సభ స్పీకర్ పోచారం సూచించారు.
సభలో ప్రవేశపెట్టే బిల్లులివే...
►వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నాలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేయాలనే సవరణ కూడా చేస్తారు.
►రెవెన్యూ చట్టంలోని సవరణలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా స్వల్ప సవరణ చేస్తారు.
►జీహెచ్ఎంసీ చట్టం – 1955కు సవరణ చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పాల కమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతి నిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తారు. వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ రొటేషన్ను రెండు పర్యాయాలకు మారుస్తూ చట్ట సవరణ చేస్తారు.