ఆర్థిక విద్యలో శిక్షణ అవసరం
పంజగుట్ట: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉన్నామంటే మన పూర్వీకులదగ్గర నుండి మనం నేర్చుకున్న, సంపాదించిన దాంట్లో కొంత దాచుకునే అలవాటు వల్లే అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ఆదివారం రాజ్భవన్ సంస్కృతి హాల్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ ఆధ్వర్యంలో రాజ్భవన్ సిబ్బందికి ‘ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్ధిక విద్యలో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరోనా సమయంలో రాజ్భవన్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించామని దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు నేను ఏదైనా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ తెలుగు రాష్ట్రాల రీజనల్ హెడ్ సిద్దార్ధ చటర్జీ, వైస్ ప్రసిడెంట్, సౌత్ జోనల్ హెడ్ జి.శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ట్రైనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.