తెలంగాణ సీఎంవో, రాజ్‌భవన్‌లకు బాంబు బెదిరింపు | Suspicious Mail Over Telangana CMO And Raj Bhavan | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎంవో, రాజ్‌భవన్‌లకు బాంబు బెదిరింపు

Dec 9 2025 12:24 PM | Updated on Dec 9 2025 5:46 PM

Suspicious Mail Over Telangana CMO And Raj Bhavan

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపుల వ్యవహారం అధికారులను, పోలీసులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. తాజాగా తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌(రాజ్‌భవన్‌)లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. వాటిని పేల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆగంతకుడు మెయిల్ పంపాడు. దీంతో, అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌(రాజ్‌భవన్‌)లకు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. వాసుకి ఖాన్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అ‍ప్రమత్తమైన అధికారులు.. వీఐపీలను ప్రముఖులను అందులో నుంచి ఖాళీ చేయించారు. బెదిరింపులు రావడంతో గవర్నర్ కార్యాలయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్ పై దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి ఈ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. ఈరోజు కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఎయిర్‌పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని మెయిల్ పంపాడు.. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తా అంటూ బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక, సోమవారం కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. శంషాబాద్‌కు వచ్చే మూడు విమానాల్లో బాంబులు ఉన్నట్టు బెదిరింపులకు దిగారు. 

Advertisement
 
Advertisement
Advertisement