
సాక్షి, నల్గొండ: హైదరాబాద్– విజయవాడ హైవే(NH 65)పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమం కానుంది. ఫిబ్రవరి 9వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ నెల 5న తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు గమనించాలన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు..టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయని పేర్కొన్నారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు
విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారులను స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వకట్ట మీదుగా 365బీబీ ఖమ్మం జాతీయరహదారిపైకి రోళ్లబావి తండా మీదుగా మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి వాహనాలు రాయినిగూడెం వద్దకు చేరుకొని హైదరాబాద్ వైపునకు వెళ్తాయి. హెవీ ట్రాన్స్పోర్టు వెహికల్స్ను మాత్రం కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి.
చదవండి: అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన