ప్రయాణీకులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..
అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, రైల్వే అధికారులు.. నిరసనకారులను చర్చలకు ఆహ్వానించడంతో ఆందోళనకారులు ఒప్పుకున్నారు. అయితే, అధికారులే రైల్వే స్టేషన్కు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో, వారి డిమాండ్ అధికారులు తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో మరోసారి రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఆందోళనకారులను స్టేషన్ నుంచి తరలించేందుకు అక్కడ.. అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. బలగాలు రైల్వే స్టేషన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆందోళనకారులను స్టేషన్ నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు కూడా మరోసారి లాఠీ ఝళిపించడంతో నిరసనకారులు స్టేషన్ బయటకు పరుగులు తీశారు. కాగా, రైల్వే ట్రాక్లను సైతం పోలీసులు.. క్లియర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయవాడ, కాజీపేట నుంచి వచ్చే రైళ్లను మౌలాలీ నుంచి దారి మళ్లించినట్టు స్పష్టం చేశారు. ఈస్కోస్ట్, శబరి, ఫలక్నామా, ధనాపూర్, షిర్డీ, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ ఆందోళన; ఈ ప్రశ్నలకు బదులేది?