ఆరుగురు జల సమాధి | Six people drowned in separate incidents in Telangana | Sakshi
Sakshi News home page

ఆరుగురు జల సమాధి

Jun 6 2026 4:59 AM | Updated on Jun 6 2026 5:21 AM

Six people drowned in separate incidents in Telangana

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరు ఘటనలు 

నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి.. వీరిలో అన్న, చెల్లెలు 

మంజీరలో స్నానం చేస్తూ మునిగిపోయిన ముగ్గురు.. వీరిలో తల్లీకూతురు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌)/బాన్సువాడ:
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో నివాసం ఉండే కంది మహేశ్‌ కొడుకు హరీశ్‌ (10), కూతురు వర్షిణి (5), ధ్యారంగుల సురేశ్‌ కొడుకు అరవింద్‌ (4) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆడుకుంటూ కాలనీ పక్కనే ఉన్న బ్రాహ్మణకుంట వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు బట్టలు విప్పి ఒడ్డున పెట్టి కుంటలోకి దిగారు. ఇటీవల కుంటలో మొరం తవ్వకాలు జరపడంతో గుంతలు ఏర్పడ్డాయి.

గుంతలు తవ్విన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు మునిగి పోయారు. మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడంతో మహేశ్, సురేశ్‌ కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. కాలనీలో, పక్కనే ఉన్న వ్యవసాయ తోటల్లో ఇతర ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్‌ఐ సీహెచ్‌ తిరుపతి, పోలీస్‌ సిబ్బంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్ద ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో అగి్నమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఘటన స్థలానికి రప్పించి గల్లంతైన పిల్లల కోసం గాలించారు. రెండు గంటల పాటు శ్రమించిన గజ ఈతగాళ్లు చివరికి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. 

ఎల్లమ్మ పండగ చేస్తుండగా.... 
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి బోలక్‌పల్లి శివారులోని మంజీర బ్రిడ్జి కింద ఎల్లమ్మ గుడి వద్ద పండగ చేశాడు. అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్ల కుటుంబాలను పిలిచాడు. అందరూ కలిసి సంతోషంగా పండగ చేసుకున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో పండరి కుమార్తె పావని(15)తోపాటు, లింగంపేట్‌ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన పండరి చెల్లి అనిత (40), ఆమె కుమార్తె శివాణి (13), పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన పండరి మరో చెల్లి సుజాత కుమారుడు భానుప్రసాద్‌తోపాటు అక్షయ, అశ్వీతలు మంజీర నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.

అయితే అక్షయ, అశ్వీతలు ఒడ్డున ఉన్నారు. అనిత, శివాణి, పావని, భానుప్రసాద్‌లు నదిలో స్నానానికి దిగారు. లోతుగా ఉండడంతో ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న అక్షయ, అశ్వీతలు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్‌ హుటాహుటిన వచ్చి నీటిలో మునిగిన అక్క అనిత, మేనకోడలు శివాణి, అన్న కుమార్తె పావని, అక్క కుమారుడు భానుప్రసాద్‌లను బయటకు తీశాడు. నీట మునిగిన వారందరినీ బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత, శివాణి, పావని మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. భానుప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement