అపార్థం చేసుకున్నాం.. గుంజీలు శిక్ష కాదు.. సూపర్‌ బ్రెయిన్‌  యోగా! ఆసక్తికర విషయాలు

Sit Ups Not Punishment Super Brain Yoga Reveals Research - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్‌గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్‌ బ్రెయిన్‌ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. 

జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. 
చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు.  

గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... 
ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్‌ కంట్రోల్‌లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్‌ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పాల్‌ నోగియర్‌ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. 

పరిశోధనలేం చెప్పాయి? 
కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్‌ జోయ్‌ పి జోన్స్‌ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్‌ బిందువులు చెవి భా­గంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడు­లోని నాడీ మా­ర్గా­లు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎల­క్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. 
ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆధునిక ప్రాణిక్‌ హీలింగ్‌ వ్యవస్థాపకుడు చౌ కాక్‌ సూయ్‌ గుంజిలపై పరిశోధన ద్వా­రా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్‌ అవుతుందని తేల్చాడు. 
మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. 

గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట
నిజామాబాద్‌కు చెందిన అందె జీవన్‌రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్‌ బ్రెయిన్‌ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్‌ ట్రైనర్‌గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

కేంద్రంలోని ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రంలోని ఎస్‌సీఈఆర్‌టీకి దీనిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో సూపర్‌ బ్రెయిన్‌ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు.
చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top