వీడిన సికింద్రాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ
హైదరాబాద్, అడ్డగుట్ట: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని కాపాడి కిడ్నాపర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు కు చెందిన షేక్ అహ్మద్ అలీ (42)కు ముగ్గురు కూతుళ్లు. చింతల్లోని రెడ్డీస్ మణికంఠ టిఫిన్ సెంటర్లో ఇతను మాస్టర్గా పని చేస్తున్నాడు.
ఇద్దరు కుమార్తెలు పుట్టిన తరువాత మూడోసారి కుమారుడు జన్మిస్తాడు అనుకుంటే మళ్లీ కూతురే పుట్టింది. జూన్ 20న స్వగ్రామానికి వెళ్లేందుకు షేక్ అహ్మద్ అలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న మహిళ పక్కనే ఐదేళ్ల బాలుడిని చూశాడు. ఇదే అదునుగా భావించి బాలుడిని తీసుకొని స్టేషన్ నుంచి చింతల్లోని ఇంటికి తీసుకెళ్లాడు.
నిందితుడి తల్లి, స్థానికులు బాలుడి గురించి అడగగా రోడ్డుపై దొరికాడని వాళ్లకు చెప్పాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ వార్తలను చూశాడు. భయంతో స్థానికంగా ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు బాలుడిని తీసుకెళ్లి, రోడ్డు పక్కనే ఒంటరిగా తిరుగుతుండగా ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు. అనుమానం కలిగిన పోలీసులు షేక్ అహ్మద్ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు అతడిని జీఆర్పీ పోలీసులకు అప్పగించగా, అహ్మద్ను రిమాండ్కు తరలించారు.


