వెయిట్‌ & సీ! | Sakshi Special interview With Doctor Rakesh Kalapala | Sakshi
Sakshi News home page

వెయిట్‌ & సీ!

Sep 14 2020 4:47 AM | Updated on Sep 14 2020 4:47 AM

Sakshi Special interview With Doctor Rakesh Kalapala

సాక్షి, హైదరాబాద్‌: అధిక బరువు.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. కరోనా కారణంగా అనేకమంది ఇళ్లకే పరిమితమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మొదలు అనేకమంది ప్రైవేట్‌ వృత్తి నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది లాక్‌డౌన్‌ టైంలో వెయిట్‌ పెరిగారు.. దీన్ని చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు కూడా.. అయితే.. ఇది సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలంటున్నారు. ఈ విషయంపై ఏషియన్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ)లోని సెంటర్‌ ఫర్‌ ఒబెసిటీ అండ్‌ మెటబాలిక్‌ థెరపీ డైరెక్టర్, ప్రముఖ కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేశ్‌ కలపాల ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

మారిన లైఫ్‌ సై్టల్‌తో అనారోగ్యం
కరోనా కారణంగా చాలామంది ఇంటికే పరిమితం అయ్యారు. జీవనశైలి రూపురేఖలు మారిపోయాయి. శారీరక శ్రమ లేకపోవడంతో షుగర్, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దీంతో సైలెంట్‌గా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు సైడ్‌ ఎఫెక్ట్స్‌కు దారితీస్తున్నాయి. 

బలవర్థకం పేరుతో అతి తిండి...
కరోనా కాలంలో పోషకాహారం తినాలన్న సూచనలతో కొందరు అతిగా తినేస్తున్నారు. దీంతో బరువు పెరుగుతున్నారు. బరువు అతిగా పెరిగితే ఫ్యాటీ లివర్‌ వస్తుంది. పేగుల మీద కూడా ఎఫెక్ట్‌ పడుతుంది. లూజ్‌ మోషన్స్‌ లేదా మలబద్దకం వస్తుంది. దీన్నే ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోం అంటారు. ఊబకాయం ఉన్నవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి.

ఈట్‌ హెల్దీ... ఈట్‌ వైజ్‌లీ... ఈట్‌ టైమ్‌లీ
ఊబకాయం నుంచి బయటపడాలంటే ప్రత్యేక ఆహార అలవాట్లు పాటించాలి. ఈట్‌ హెల్దీ... అంటే తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రొటీన్‌  ఉండేలా ఆహారం తినాలి. ఈట్‌ వైజ్‌లీ... అంటే ఆహార పదార్థాలను తెలివిగా ఎంచుకొని తినాలి. అంటే షుగర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులున్నవారు పోషకాహార నిపుణుల సలహా మేరకు ఎంపిక చేసుకొని తినాలి. ఈట్‌ టైమ్‌లీ... అంటే ఉదయం 8–9 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్, తర్వాత 11 గంటలకు స్నాక్స్‌... మధ్యాహ్నం 1–2 గంటల మధ్య భోజనం... సాయంత్రం 5 గంటలకు స్నాక్స్‌... మళ్లీ రాత్రి 7–8 గంటల మధ్య డిన్నర్‌ చేయాలి. పైగా తక్కువ మోతాదులో తినాలి. 

బెరియాట్రిక్‌ సర్జరీ: దీంతో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఇక మూడోది ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌. అంటే 24 గంటల్లో 6–8 గంటల మధ్యలో తిని మిగతా 16–18 గంటలు ఏమీ తినకుండా ఉండటమే. డాక్టర్లు, పోషకాహార నిపుణల సూచనల మేరకు చేయాలి. గుండె, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక జబ్బులున్నవారు వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చేయాలి. 

ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రో ప్లాస్టీతో..చెక్‌
అధిక బరువు ఉన్న వారు కొన్ని రకాల చికిత్సలతో తగ్గించుకోవచ్చు. అందులో అత్యుత్తమమైనది ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రో ప్లాస్టీ (ఈఎస్‌జీ). ఈ విధానం నాన్‌  సర్జికల్‌ (కోత లేకుండా) చేసే ప్రక్రియ. ఇది నూటికి నూరుశాతం సురక్షితమైనది. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియలో పొట్ట సైజ్‌ను లోపల కుట్టేసి కుదిస్తారు. దీంతో తక్కువ ఆహారం తినడం వల్ల బరువు తగ్గుతారు. హార్మోన్‌ ్స ప్రొడక్షన్‌ను తగ్గిస్తుంది. ఆరు నెలల్లో 15–20 శాతం తగ్గుతారు. దీన్ని ఎటువంటి అనారోగ్య సమస్యలున్నవారైనా చేసుకోవచ్చు.

వాకింగ్‌ అవసరం... 
మానసిక ఒత్తిడి వల్ల కూడా కొందరు అతిగా తింటారు. దానివల్ల ఊబకాయం వస్తుంది. వాకింగ్, రన్నింగ్, బరువులు ఎత్తాలి. 40 నిమిషాల నుంచి గంట పాటు వీటిని చేయవచ్చు. ఎసిడిటీ రాకుండా కారం, మసాల, ఆయిల్‌ తగ్గించి తినాలి. 

Advertisement
 
Advertisement
Advertisement