విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ | Rs 700 Crore Be Spent To Modernise Secunderabad Railway Station: Kishan Reddy | Sakshi
Sakshi News home page

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

Nov 15 2022 2:31 AM | Updated on Nov 15 2022 10:19 AM

Rs 700 Crore Be Spent To Modernise Secunderabad Railway Station: Kishan Reddy - Sakshi

అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకుంటున్న కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వచ్చే నాలుగు దశాబ్దాల అవసరాలకు సరిపడా అత్యంత ఆధునికంగా, మెరుగైన మౌలికవసతులతో కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్‌ పునరాభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ ఇతర ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా రీడెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా రీడెవల్‌మెంట్‌ మూడు దశల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ పనులు 28 నెలల్లో, మూడో దశ 36నెలల్లో పూర్తవుతాయన్నారు.

719 కోట్ల తో చేపట్టే ఈ భవన సముదాయంలో 32 ఎస్కలేటర్లు, 26 లిఫ్టులు, ట్రావెలేటర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణాలవైపు జీప్లస్‌ 3 అంతస్తులతో రెండు భవనాలు రూపుదిద్దుకుంటాయని, 2 అంతస్తుల స్కై కాన్‌కోర్సు ఉంటాయన్నారు. వచ్చేవారికి, వెళ్లేవారికి వేర్వేరు మార్గాలుంటాయని, ఒక మల్టీ లెవల్, ఒక అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ యార్డులుంటాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ దిశగా చర్యలకు నిధులు విడుదల చేస్తోందని తెలిపారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా యాదాద్రి వరకు పనులు జరగా ల్సి ఉన్నా, రాష్ట్రప్రభుత్వం వాటా నిధులు ఇవ్వటంలో జాప్యం చేస్తుండటం పనుల్లో ఆలస్యానికి కారణమన్నారు. సికింద్రాబాద్‌ –విజయవాడ మధ్య నడవబోయే వందేభారత్‌ రైళ్లను తిరుపతి వరకు పొడిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కాజీపేటలో వాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, భూసేకరణ పనులు జరుగుతున్నాయని, ముందు నిర్ధారించిన 150 ఎకరాలకు మరో మూడునాలుగు ఎకరాలు అవసరమవుతా యని తెలిపారు. కొత్త లైన్ల నిర్మాణానికి భూసేకరణ జరుగుతోందని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement