2న ‘సమగ్ర సర్వే’ నివేదిక | Revanth Reddy on the comprehensive household survey undertaken in the state | Sakshi
Sakshi News home page

2న ‘సమగ్ర సర్వే’ నివేదిక

Jan 30 2025 4:18 AM | Updated on Jan 30 2025 7:42 AM

Revanth Reddy on the comprehensive household survey undertaken in the state

మంత్రివర్గ ఉప సంఘానికి అందజేస్తామన్న అధికారులు 

ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌ 

రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతమైందని వెల్లడి 

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని వ్యాఖ్య 

అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను అధికారులు వచ్చే నెల 2న మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నారు. దానికన్నా రెండు రోజులు ముందే నివేదిక ముసాయిదాను సిద్ధం చేసి అందించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీక్షించారు. 

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. 

ఈ సర్వే రాష్ట్రంలో సామాజిక సాధికారతతోపాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల సర్వే చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌కు ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం పట్ల ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. 

విస్తృత స్థాయిలో ప్రక్రియ చేపట్టి.. 
గత ఏడాది ఫిబ్రవరి 4న సీఎం రేవంత్‌ నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సబ్‌ కమిటీ ఏర్పాటు, పరిశీలన తర్వాత.. నవంబర్‌ 6న ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిసెంబర్‌ మొదటి వారంలో సర్వే పూర్తయింది. 

ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగులు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే కోసం గుర్తించగా.. 96 శాతం కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. కొన్నిచోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, ఇళ్లకు తాళాలు ఉండటం, అందుబాటులో లేకపోవటంతో మిగతా కుటుంబాల వివరాల సేకరణ జరగలేదని అధికారులు సమీక్షలో వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement