డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
జూన్ 15 నుంచి బడులు
వచ్చే మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు
పాఠశాల విద్య కేలండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: పాఠాలతో పాటు నైపుణ్యం, సృజనాత్మకత పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు విధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిజిటల్ లెర్నింగ్తోపాటు వ్యాయా మ, ఆరోగ్య సంబంధమైన విద్యను తప్పనిసరి చేసింది. ఆర్ట్స్, కల్చర్, వ్యాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్తోపాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ను తప్పనిసరి చేసింది. పాఠశాల నిర్వహణకు సంబంధించిన 2026–27 విద్యా కేలండర్ను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం విడుదల చేశారు.
వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలను జూన్ 13 నుంచి తెరవాలి. కానీ, 14వ తేదీ రెండో శనివారం, ఆ మర్నాడు ఆదివారం కావడంతో జూన్ 15 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తంగా ఈ ఏడాది 227 పని దినాలు పాఠశాలలు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెన్త్ సిలబస్ను 2027 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని, ఆ తర్వాత రివిజన్ ప్రారంభించి, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని కేలండర్లో పేర్కొన్నారు.
ప్రతీ రోజు ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ చేపడతారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు జూన్ 19 వరకూ బడిబాట నిర్వహించనున్నారు. టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 2027లో నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 13 రోజులపాటు దసరా, 5 రోజులు క్రిస్మస్, 5 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి.


