న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం

Peddapalli Advocate Assassination Case High Court Questions TS Police - Sakshi

పోలీసులపై ప్రశ్నలు కురిపించిన హైకోర్టు

తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.

ఏ2, ఏ3ల స్టేట్‌మెంట్‌ని ఎందుకు సెక్షన్‌ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్‌ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్‌ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్‌డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో తెలపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్‌ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందు​కు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు.

నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. పూ​ర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.

చదవండి: 
న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్‌
న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top