
జేఈఈ మెయిన్–2025 ఫలితాల్లో సగానికి సగం తగ్గిన టాపర్ల సంఖ్య
గతేడాది 56 మందికి 100 పర్సంటైల్.. ఈసారి వారి సంఖ్య 24కే పరిమితం
వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు
2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 21 మందికి 100 పర్సంటైల్
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్ పర్సంటైల్ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.
గతేడాది జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్గా నిలవగా అజయ్రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ టాపర్గా నిలిచాడు.
భారీగా దరఖాస్తులు...
జేఈఈ మెయిన్–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో 93.102 పర్సంటైల్గా కటాఫ్ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్ పర్సంటైల్ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిలిపేసింది.
ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్డ్’కు రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.