‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’ | Nizamabad Women Incident | Sakshi
Sakshi News home page

‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’

May 11 2025 9:16 AM | Updated on May 11 2025 9:16 AM

Nizamabad Women Incident

    యువతికి వేధింపులు 

     యువకుడిపై కేసు నమోదు..

హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. 

కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్‌ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. 

దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్‌ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్‌ నెంబర్‌ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement