
శివంగి టీంను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క, చిత్రంలో ఎస్పీ జానకీ షర్మిల
రాష్ట్రంలో తొలిసారి నిర్మల్లో మహిళా కమాండోస్
45 రోజులపాటు మహిళా కానిస్టేబుళ్లకు కఠోర శిక్షణ
టీం శివంగిగా పేరు.. ప్రారంభించిన మంత్రి సీతక్క
నిర్మల్టౌన్: వివిధ రంగాల్లో మహిళా శక్తి భాగస్వామ్యం వేగంగా పెరుగుతున్నా.. కొన్ని కష్టతరమైన రంగాల్లో ఇప్పటికీ తక్కువగానే ఉన్నది. ముఖ్యంగా భద్రతా దళాలు, పోలీస్ విభాగాల్లో పురుషాధిక్యమే కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చే పనికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పునాది వేశారు. త్రివిధ దళాల తరహాలో జిల్లాలో మహిళా కమాండోస్ను తయారు చేశారు. పురుషులకు దీటుగా మహిళా కానిస్టేబుళ్లకు కఠోర శిక్షణ ఇచ్చి మెరికల్లా తయారుచేశారు. వారికి ‘టీం శివంగి’గా నామకరణం చేశారు.
45 రోజుల శిక్షణ
టీం శివంగి కానిస్టేబుళ్లకు 45 రోజులపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. శారీరక దృఢత్వం, పరుగు పందేలు, వెరైటికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, పోరాట నైపుణ్యాలు, పేలుడు పదార్థాల నిర్వహణలో శిక్షణ, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాల వినియోగం, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం, ఆకస్మిక వ్యూహాలు, శత్రువుల కదలికలు, అడవి సంకేతాలను చదవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడి, ఎదురుదాడి కసరత్తులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం లాంటివి ఈ శిక్షణలో నేర్పించారు. ఈ శిక్షణ పొందినవారికి ఆయా విభాగాల్లో స్పెషల్ టీంలుగా నియమిస్తున్నారు.
మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క టీం శివంగిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎస్పీ జానకీ షర్మిల చేస్తున్న కృషిని అభినందించారు. మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురు మహిళలను వెతికి పట్టుకోవడంలో ఎస్పీ, సిబ్బంది పడ్డ కష్టాన్ని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివంగి టీంలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణలో కష్టంతో కాకుండా ఇష్టంగా నేర్చుకోవాలని తెలిపారు.