
బస్తర్ ఆవల విస్తరణకు 2011లోనే మావోయిస్టుల ప్రణాళిక
కేకేటీ–4, ఎంఎంసీ–5 పేర్లతో కొత్త గెరిల్లా జోన్లు
అక్కడ ఆశించిన విజయాలు దక్కకున్నా..పునాదులైతే పడ్డాయి
కర్రి గుట్టల నుంచి ముఖ్యనేతలు తరలినట్టు అనుమానాలు !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కర్రి గుట్టల్లో భద్రతా దళాలకు చిక్కకుండా మావోయిస్టు నేతలు దాక్కున్నారా.. లేక ఆపరేషన్ మొదలు కాకముందే రహస్యంగా సేఫ్జోన్లకు తరలి వెళ్లారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేలాదిమంది పారా మిలిటరీ, హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో భద్రతాదళాలు ‘బచావో కర్రి గుట్టలు’ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ మొదలై తొమ్మిది రోజులు పూర్తయినా ఇంత వరకు ఈ గుట్టలపై మావోల జాడ కానరాలేదు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మావోయిస్టులు ఉత్తర దండకారణ్యంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. దీంతో ఎప్పటికైనా ప్రభుత్వ నిర్బంధం తీవ్రం అవుతుందనే అంచనాతోపాటు కొత్త ప్రాంతాల్లో పార్టీ విస్తరణపై మావోయిస్టులు దృష్టి సారించారు.
2011లో కేకేటీ గెరిల్లా జోన్
కర్ణాటక–తమిళనాడు సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను తుదముట్టించేందుకు ఆ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఏళ్ల తరబడి ఆపరేషన్ చేపట్టాయి. ఎట్టకేలకు 2004 అక్టోబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో వీరప్పన్ చనిపోయాడు. దీంతో అప్పటివరకు ఈ అడవులపై కొనసాగిన పోలీస్ నిఘా ఆ తర్వాత క్రమంగా పలుచపడింది.
దీంతో ఉత్తర తెలంగాణ, బస్తర్, ఏఓబీ తర్వాత నాలుగో గెరిల్లా జోన్గా కర్ణాటక –కేరళ–తమిళనాడు (కేకేటీ) సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతాన్ని 2011లో మావోయిస్టు పార్టీ ప్రకటించినట్టు సమాచారం. ఈ మేరకు కొత్తగా సదరన్ రీజనల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. 2011లో విస్తరణ పనులు మొదలు పెడితే 2014 నాటికి ఈ జోన్లో పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ చేయగలిగే స్థాయికి చేరుకుంది.
2015లో గెరిల్లా జోన్ –5
పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ మొదలు పెట్టిన మరుసటి ఏడాది నుంచే కేకేటీ జోన్లో మావోలకు ఎదురుగాలి వీయడం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల అరెస్ట్, లొంగుబాటు లేదా ఎన్కౌంటర్లలో చనిపోవడం వంటి ఘటనలతో ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయారు. దీంతో అప్రమత్తమైన ఆ పార్టీ మధ్యప్రదేశ్– మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) సరిహద్దు ప్రాంతాన్ని గెరిల్లా జోన్–5గా 2015 లో ప్రకటించింది. ఈ రెండు గెరిల్లా జోన్లలో పార్టీని విస్తరించే పనులను కేంద్ర కమిటీతోపాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజినల్ బ్యూరోలో ఉన్న పెద్ద తలలకు అప్పగించినట్టు చెబుతారు.
ఎవరు ఉన్నారు..ఎవరు వెళ్లారు
గెరిల్లా జోన్లుగా ప్రకటించిన కేకేటీ, ఎంఎంసీ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉత్తర తెలంగాణ, బస్తర్, ఏఓబీ ప్రాంతాల్లో దక్కినంత ఆదరణ లభించలేదు. కానీ ఆ పార్టీకి అక్కడ పునాదులైతే పడ్డాయి. కేకేటీ జోన్లో వెస్టర్న్ ఘాట్ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటైంది. కేరళలోని కన్నూరు, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్ జోన్లుగా మారాయని నిఘా వర్గాల అంచనా. ఇక్కడ పార్టీ విస్తరణ కార్యక్రమాలను నల్లగొండ జిల్లాకు చెందిన ఉయికే గణేశ్ ఆలియాస్ పాక హనుమంతు చూస్తున్నట్టు సమాచారం.
ఎంఎంసీ గెరిల్లా జోన్లో మహారాష్ట్రలో గోండియా, మధ్యప్రదేశ్లో బాల్ఘాట్, ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గావ్ జిల్లాల్లో ఆ పార్టీకి పట్టు చిక్కినట్టు తెలుస్తోంది. అందువల్లే ఇక్కడ కొత్తగా దర్భ డివిజన్ కమిటీ ఏర్పాటైంది. అయితే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఈ డివిజన్ కమిటీ సభ్యుడు జగదీశ్ మరణించడం ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చింది. అయినా ఈ మూడు జిల్లాల సరిహద్దులో విస్తరించిన కన్హా నేషనల్ పార్క్, భరాన్దేవ్ టైగర్ రిజర్వ్, అమర్కంటక్ అడవుల్లో మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితులు ఉన్నట్టు సానుభూతిపరులు అంటున్నారు.
ఇవి కాకుండా మావోలకు పట్టున్న ఏఓబీ నుంచి జార్ఖండ్, బీహార్– బెంగాల్ మీదుగా విదేశాల్లో ఉన్న సేఫ్డెన్లకు మావోలు చేరుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఎంత మంది కర్రిగుట్టల మీద ఉన్నారు? ఎంత మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారనే చర్చ సాగుతోంది.