
నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదు
వారి కుటుంబసభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట, నవాబ్పేటలలో శుక్రవారం మంత్రి జూపల్లితో కలిసి సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో భట్టి మాట్లాడుతూ తలాపున ఉన్న కృష్ణమ్మను ఈ ప్రాంతానికి మళ్లించడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ కాలం వెళ్లదీసిందే తప్ప గుక్కెడు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందుగా నార్లపూర్ పంప్ను ఆన్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తామే పాలమూరు పనులను పూర్తి చేస్తామన్నారు.బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని.. నిధులు ఆవిరయ్యాయని.. దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారని భట్టి మండిపడ్డారు. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని వారి కుటుంబసభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారని తెలిపారు.
అధికారం పోయిందనే కేసీఆర్కు దుఃఖం: జూపల్లి
రాష్ట్రంలో 17 నెలల పాలన చూస్తుంటే తనకు దుఃఖం వస్తోందని వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడ డాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ.. అధికారం పోయిందని, కుటుంబసభ్యులకు పదవులు పోయాయనే ఆయనకు దుఃఖం వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే రూ.65 వేల కోట్ల అప్పు ఉండగా.. కేవలం పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.
60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ వద్ద పార్టీ ఫండ్ రూ.15 కోట్లు ఉండగా, కేవలం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు రూ.1,500 కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.