సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు.


