కాలిపోయిన మొక్కజొన్న కంకుల వద్ద రోదిస్తున్న రాంజీ భార్య కాంతి
రూ.3.50 లక్షల ఆస్తి నష్టం
ఖానాపురం: అది కేవలం మొక్కజొన్న కుప్ప కాదు.. రైతన్నల ఆరుగాలం శ్రమ, ఎన్నో ఇంటి అవసరాల కోసం పేర్చుకున్న ఆశల రాశి. వరంగల్ జిల్లా నాజీతండాకు చెందిన రాంజీ, బాలు అనే ఇద్దరు రైతులు ఎండనక వాననక కష్టపడి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో ప్రమాదవశాత్తు నిప్పులపాలైంది.
సుమారు 3.50 లక్షల విలువైన పంట కళ్లముందే బూడిదవుతుంటే, ఆ మంటలను ఆర్పలేక ఆ రైతులు పడిన ఆవేదన వర్ణనాతీతం. కాలిపోయిన ఆ కుప్పల వద్ద రాంజీ భార్య కాంతి గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు చూసి తండావాసులు కన్నీరు పెట్టారు. ఏడాది కష్టం చివరకు గుప్పెడు గింజ కూడా మిగలకుండా మసి కావడంతో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కూలబడ్డాయి.


