ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు | Loans for Indiramma houses | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు

Jun 29 2025 4:58 AM | Updated on Jun 29 2025 4:58 AM

Loans for Indiramma houses

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే వినూత్న కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో జిల్లా అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాలతో ఇళ్ల నిర్మాణాలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. జిల్లాలో మొత్తం 405 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్ప టి వరకు 281 మందికి అందించారు.  

శరవేగంగా ఎంపికలు..  
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా తొలుత 860 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అర్హతల మేరకు ఎంపికలు జరిగాయి. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుండగా.. అన్ని అర్హతలున్న వారికి మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. అయితే, ఇల్లు మంజూరైనా కొందరి వద్ద డబ్బు లేకపోవటంతో నిర్మాణం మొదలు పెట్టలేదు. 

ఇటీవల అధికారులు ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు వెళ్లగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలు తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన జిల్లా అధికారులతో చర్చించి స్వయం సహాయక సంఘాలను ఇందులో భాగస్వాములను చేశారు. 

ఇళ్ల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘంలో సభ్యులైతే వారికి రుణం అందించేలా ఆయా సంఘాలను ఒప్పించారు. 860 మందిలో 405 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 281 మందికి రుణ సౌకర్యం కల్పించారు. మరో 124 మందికి రుణాలు అందించాల్సి ఉంది.  

రూ.లక్షన్నర రుణం తీసుకొని.. 
తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామానికి చెందిన రేఖ విజయకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే, డబ్బు లేక ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఐకేపీ సాయంతో రూ.50 వేలు ముద్ర లోన్‌ తీసుకున్నారు. 

అలాగే ఆమె అత్త డ్వాక్రా సభ్యురాలు కావడంతో రూ.లక్ష రుణం తీసుకున్నారు. ఈ సొమ్ముతో నిర్మాణం ప్రారంభించడంతో పునాదుల తర్వాత ప్రభుత్వం తొలి విడత బిల్లు చెల్లించింది. ఆ తర్వాత రూఫ్‌ లెవెల్‌ వరకు పూర్తి కావడంతో ఇప్పటివరకు రూ.2 లక్షల బిల్లు వచి్చనట్లు విజయ తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement