ఆ బొగ్గుబ్లాక్‌ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఆ బొగ్గుబ్లాక్‌ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్‌రెడ్డి

Published Tue, Apr 26 2022 4:37 AM

Kishan Reddy Slams Trs Government Over Singareni Privatisation Telangana - Sakshi

భూపాలపల్లి అర్బన్‌/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్‌కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించా రు. మరో 4 బొగ్గుబ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించవద్దని రాష్ట్రం దరఖాస్తు చేసుకుంటే వాటిని సింగరేణికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణిని, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు.  బీఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రను సోమవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించారు.

మధ్యాహ్నం ఏరియాలోని కేటీకే ఐదో గనిలో జరిగిన యాత్రలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్‌ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23వేల కోట్లు చెల్లించడంలో రాప్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని కోల్‌ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలను రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, కిషన్‌రెడ్డి రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు.  గుట్ట అభివృద్ధికి అవసరమైన నిధులపై జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు.  

మీ దౌర్జన్యం ప్రజల తిరుగుబాటుతో పతనం 
ప్రజల తిరుగుబాటుతో టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ దౌర్జన్యం పతనం కాక తప్పదని, నియంతృత్వ పోకడ, అహంకారం, కుటుంబపాలన త్వరలోనే పోతుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయలేదని, కనీస క్వార్టర్స్‌ సౌకర్యం కల్పించడం లేదని, యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. 

Advertisement
Advertisement