భగ్గుమన్న ‘బిచ్కుంద’
ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన ఇసుక లారీ
లారీకి నిప్పు పెట్టిన స్థానికులు.. మరో 12 లారీల అద్దాలు ధ్వంసం
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
నిజాంసాగర్ (జుక్కల్): ద్విచక్రవాహన దారుడిని ఇసుక లారీ ఢీకొనడంతో సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం భగ్గుమంది. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి స్థానికులు నిప్పుపెట్టడంతో పాటు మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వివరా లుఇలా ఉన్నాయి. గోపన్పల్లి గ్రామా నికి చెందిన విజయ్ బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపును మూసివేసిన విజయ్, ద్విచక్రవాహనంపై గోపన్పల్లికి బయలు దేరాడు. బిచ్కుందలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతంనుంచి వెళుతున్న విజయ్ను అదే సమయంలో వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ బైక్పై నుంచి కిందపడిపోగా లారీ అతని నడుముపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన విజయ్ను చుట్టుపక్కలవారు వెంటనే 108 అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి నిప్పుపెట్టారు. అంతేకాకుం డా రోడ్డుపై నిలిపి ఉంచిన మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడి చేరుకోగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. బిచ్కుంద సీఐ సాజిద్ ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. సుమా రు రెండు గంటల పాటు బిచ్కుంద పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను చక్కదిద్దారు.