పదేళ్లుగా రుణాలు ఇవ్వడంలో.. రికవరీలో నంబర్ వన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ.. తిరిగి రికవరీలో నిజామాబాద్ జిల్లా గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా పదేళ్ల పాటు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్ణయిస్తున్న లక్ష్యాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తేలికగా దాటడంతోపాటు లక్ష్యాన్ని మించి రుణాలు అందజేస్తోంది. జారీ చేసిన రుణాలను రికవరీ చేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా ప్రథమంగా నిలుస్తోంది. దీంతో ఏటా నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ఫస్ట్ అవార్డులు అందుతున్నాయి.
» స్త్రీనిధి రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.5 లక్షల వరకు ప్రభుత్వం అందజేస్తోంది. వివిధ వ్యాపారాలు, పరిశ్రమలకు, సోలార్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. గడిచిన పదేళ్లలో (2016–2026) రూ.1,372.12 కోట్లు స్వయం సహాయక గ్రూపుల మహిళా సభ్యులకు పంపిణీ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 108.06 శాతం రుణాలు అందజేసి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా అవార్డు దక్కించుకుంది. రికవరీలోనూ 93–99 శాతం వసూలు చేసి పదేళ్లు వరుసగా సత్తా చాటి ప్రత్యేకత సాధించింది.
ఉత్సాహాన్ని కొనసాగిస్తాం
స్త్రీనిధి రుణాల పంపిణీలో నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టే విషయంలో స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం చాలా ఉంది. రుణాలు అందజేయడం, రికవరీ విషయంలో సిబ్బంది కృషి సైతం చాలా ఉంది. పదేళ్లుగా వరుసగా సాధిస్తున్న అవార్డులు జిల్లాకు గర్వకారణం. – రాందాస్ –స్త్రీనిధి ఆర్ఎం


