
మిస్ వరల్డ్ పోటీలతో అవకాశం
విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ఆస్కారం
మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలు.. తెలంగాణ, హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు, రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహద పడతాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి బృందం దావోస్, జపాన్లలో పర్యటించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సాధించిందని, ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో జరగటం ద్వారా మరిన్ని పెట్టుబడులకు అవకాశం చిక్కినట్టవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్ గురించి ప్రపంచ వ్యాప్తంగా సానుకూల ప్రచారం జరిగి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావటానికి అవకాశం లభిస్తుందని వెల్లడించారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర శక్తిని నిరూపించుకునే సమయం
‘మన ఘనమైన చరిత్ర, సంస్కృతిపై ప్రపంచ స్థాయిలో బలంగా ప్రచారం జరగటానికి ఈ పోటీలు కారణమవుతాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించే అవకాశం పొందేందుకు పలు దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాలు ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణకే చాన్స్ దక్కింది. పోటీలు ఘనంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర శక్తిని నిరూపించుకునే సమయం వచి్చంది. ఈ పోటీలు ఎలాంటి లోపాలు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం..’అని జూపల్లి తెలిపారు.
సామాన్యులు తిలకించేందుకూ అవకాశం: జయేశ్ రంజన్
ఈ పోటీలు కేవలం ధనవంతుల కోసమే అన్న విమర్శను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నామని, సాధారణ ప్రజలు కూడా ఈ పోటీలను తిలకించేందుకు సీఎం ఆదేశం మేరకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ప్రారంభ వేడుకలు, పోటీదారుల స్పోర్ట్స్ ఈవెంట్, టాలెంట్ కాంటెస్ట్, హైటెక్స్లో 23, 25 తేదీల్లో జరిగే కార్యక్రమాలను సామాన్యులు కూడా తిలకించేందుకు కూడా వీలు కల్పిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ సరైన వేదిక: జూలియా మోర్లే
ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుతున్నారని, తెలంగాణను ఎందుకు ఎంచుకోవద్దని తాను అంటున్నానని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అన్నారు. ఈ పోటీలకు తెలంగాణ సరైన వేదికగా తాము భావించామని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ అప్యాయత చూపేవారని, గొప్ప పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
బిర్యానీ, ఇరానీ చాయ్ ఇష్టం
హైదరాబాద్, తెలంగాణ అంటే తనకు అమితమైన అభిమానమని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతను పంచుతున్నారని మిస్ వరల్డ్ ఇండియా నందినీ గుప్తా చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. ప్రముఖ నటుడు, ఈ పోటీల జ్యూరీ సభ్యుడు సోనూసూద్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, హైటెక్స్ నిర్వాహక వర్గం ప్రతినిధి శ్రీకాంత్, ట్రైడెంట్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ కే కుమ్రా తదితరులు పాల్గొన్నారు.
అట్ట ముక్కలతో తోరణాలా?
గచ్చిబౌలి: మిస్ వరల్డ్ అందాల పోటీల ప్రారంభ వేడుకలకు వేదికైన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్వాగత ఏర్పాట్లపై మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన షోబోట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్వాగత తోరణాలకు అట్ట ముక్కలను ఉపయోగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో తోరణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.