సూర్యాపేటలో విషాద ఘటన | Junior Assistant Ends His Life In Suryapet Due To Job Pressure, More Details Inside | Sakshi
Sakshi News home page

చదువుకు-చేసే కొలువుకు సంబంధం లేదని..

Jan 31 2025 1:04 PM | Updated on Jan 31 2025 2:40 PM

Junior Assistant Ends Of Life In suryapet

మిర్యాలగూడ అర్బన్‌: తను చదువుకున్న చదువుకు.. చేసే కొలువుకు సంబందం లేని ఉద్యోగం.. వచ్చిన ఉద్యోగం చేసేందుకు ఇష్టం లేని యువకుడు సాగర్‌ కాల్వలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురారం మండలం బెజ్జికల్‌ గ్రామానికి చెందిన నూనె రాములు, నిర్మల రెండవ కుమారుడు  ప్రవీణ్‌కుమార్‌ (30) బీటెక్‌ పూర్తి చేసి గ్రూప్‌–4 పరీక్ష ఫలితాల్లో మెరిట్‌ సాధించాడు. దీంతో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికై గత డిసెంబర్‌ 28న మిర్యాలగూడ తహశీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

అయితే ప్రవీణ్‌ ఉద్యోగంలో చేరిన సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ పధకాల క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కావడంతో క్షేత్ర స్తాయిలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్బాల్లో తన తల్లిదండ్రులతో చెప్పుకున్నాడు. అయితే తెలంగాణ జెన్‌కో నిర్వహించిన పరీక్షలో విద్యుత్‌ ఏఈ పోస్టు ఇంటర్వూకు 1:2 లో ఎంపికైన అతడు కొద్ది తేడాతో ఏఈ ఉద్యోగం చేజారింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అంతే కాకుండా వచ్చే నెలలో గ్రూప్స్‌ రిజల్ట్స్‌ కూడా ఉండటంతో తాను కచ్చితంగా గ్రూప్స్‌ సాధిస్తాననే నమ్మకం ఉందని.. ఈ ఉద్యోగం వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రూప్స్‌ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగైనా ఓపిక పట్టుకుని ఉండమని తల్లిదండ్రులు అతడిని సముదాయించారు. 

ఉన్నత చదువులు తనకు చదవుకు తగ్గ కొలువు దక్కలేదని గత కొద్ది రోజులుగా తన తోటి సిబ్బంది వద్ద వాపోయేవాడని కూడా కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం డ్యూటికి వచ్చిన ప్రవీణ్‌కుమార్‌ రాత్రి ఇంటికి ఫోన్‌చేసి తల్లితో తన భాదను చెప్పగా.. ఎప్పటిలాగే వారు సర్దిచెప్పారు. అయితే, బుధవారం ప్రవీణ్‌కుమార్‌కు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో వేములపల్లి సమీపంలోని సాగర్‌ కాల్వ వద్ద చివరి సారిగా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ చూపించాయి. 

ప్రవీణ్‌కుమార్‌ స్కూటీ సాగర్‌ కాల్వ వద్ద నిలిపి ఉంచడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం దొండవారిగూడం వద్ద సాగర్‌కాల్వలో ప్రవీణ్‌కుమార్‌ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు  మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌కుమార్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement