Hyderabad: Over 3000 Fish Died In Banjara Hills Lotus Pond - Sakshi
Sakshi News home page

లోటస్‌పాండ్‌ చెరువులో 3 వేలకుపైగా మృతి.. విష ప్రయోగమా? కలుషిత నీరా..?

May 10 2023 10:20 AM | Updated on May 10 2023 1:27 PM

Hyderabad Banjara Hills Lotus Pond Over 3000 Fish Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.  

విష ప్రయోగమా? కలుషిత నీరా..? 
వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్‌ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్‌లో వినియోగించే కెమికల్‌ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్‌ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. 

శాంపిల్స్‌ సేకరించిన అధికారులు 
గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో పాటు ఎని్వరాన్‌మెంట్‌ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్‌ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు.  

చేపలకు ఆహారం...  
నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్‌ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు.
చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు సహకరిస్తున్నాం

Advertisement
 
Advertisement
Advertisement